High Temperature

తెలంగాణలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా మార్చి నుంచి వేసవి ప్రారంభమయ్యే సమయంలో ఎండ తీవ్రత పెరుగుతుంది కానీ, ఈసారి అకాలంగా వేడి పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. భద్రాచలంలో గరిష్ట ఉష్ణోగ్రత 34.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ పేర్కొంది.

రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వేడిగాలులు వీచే ఛాన్స్ ఉంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్ర రూపం తీసుకునే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

ప్రస్తుతం ఉదయం సమయంలో చలి అనుభూతి కలుగుతుంది. మధ్యాహ్నం విపరీతమైన ఎండ కొడుతోంది. దిగువ స్థాయిలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నందున గత రెండు రోజులుగా చలి కొంత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. రాజేంద్రనగర్‌లో 15 డిగ్రీలు, హైత్‌నగర్, పఠాన్‌చేరులో 16 డిగ్రీల వరకు చలి ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య ఉన్నాయి.

ఈ నెల చివరికి వాతావరణంలో మార్పులతో చలి తగ్గి, ఎండ వాతావరణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. ఐదు రోజుల పాటు ఎటువంటి హెచ్చరికలు లేవు. ఉదయం పొగమంచు, చలితో ఉత్తర తెలంగాణ, నగర శివారుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెచ్చని నీరు తాగడం, శరీరాన్ని సంరక్షించుకోవడం ముఖ్యం. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-19 డిగ్రీలు నమోదయ్యాయి. మార్చి నుంచి విపరీత ఎండలు, డీహైడ్రేషన్ ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.