Silver Rates

వెండి క్రాష్: ₹15,000 ఒక్క రోజే పడిపోయింది!

హైదరాబాద్‌: బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మరింత దిగజారుతున్నాయి. ఒక్కరోజు ఏకంగా ₹15,000 తగ్గిన వెండి ధర ఇప్పుడు కేజీకి ₹2,85,000కు చేరుకుంది. కొన్ని వారాల క్రితం ₹4 లక్షలు దాటిన సిల్వర్ ధర ఇలా భారీగా కుప్పకూలడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. గత వారంలోనే సుమారు ₹50,000 తగ్గిన వెండి, రానున్న రోజుల్లో కూడా హెచ్చు తగ్గులు కొనసాగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

“ఎంతగా మిడిసి పడిందో అంతగా తరిగిపోతుంది. మళ్లీ పాత రేట్లకు చేరుకునేందుకు సమయం పడుతుంది” అని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం ఒక్క రోజే ₹15,000 పతనం నమోదైంది. ఇది కేవలం ఒక రోజు పతనం కాదు, వారం రోజుల్లోనే భారీ నష్టం. ధరలు ఎక్కువైనప్పుడు లాభాలు బుక్ చేసుకోవడం (ప్రాఫిట్ బుకింగ్) పెరగడం, షార్ట్ సెల్లింగ్‌లు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు.

అమెరికా డాలర్ బలపడటం కూడా వెండిని కరిగిస్తోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, ట్రంప్ ప్రభుత్వం తీసుకునే టారిఫ్ పాలసీలు, ట్రేడ్ యుద్ధాలు – ఇవన్నీ సేఫ్ హెవెన్‌గా భావించే వెండిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నంత మేరకు వెండి ధరలు ఒత్తిడికి లోనవుతున్నాయి.

అయితే బంగారం ధరలు వెండి తరహాలో భారీ పతనం చెందడం లేదు. 24 క్యారెట్ తులం బంగారం ధర ₹430 పెరిగి, 10 గ్రాముల బంగారం ₹61,780కు స్థిరంగా ఉంది. బంగారంలో కేవలం చిన్న చిన్న హెచ్చు తగ్గులు మాత్రమే కనిపిస్తున్నాయి.

బులియన్ మార్కెట్ నిపుణులు రానున్న రోజుల్లో రెండు లోహాల ధరల్లోనూ హెచ్చు తగ్గులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ కొనుగోలుదారులకు అవకాశం ఉన్నప్పటికీ, మార్కెట్ ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించాలని నిపుణుల సలహా.