
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కీలక నిర్ణయం.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కార్మికుల వేతనాలను 30% పెంచి, రోజుకు రోజు చెల్లించాలని, లేనిపక్షంలో షూటింగ్లలో పాల్గొనబోమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషా సినిమాలు, వెబ్ సిరీస్లకు కూడా వర్తిస్తుందని ఫెడరేషన్ లేఖ విడుదల చేసింది. నిర్మాతల నుంచి వేతన పెంపునకు సంబంధించి లిఖితపూర్వక హామీ లభించిన తర్వాతే షూటింగ్లలో పాల్గొంటామని తెలిపింది.
గతంలో కార్మిక శాఖ కమిషనర్తో చర్చలు జరిగినప్పటికీ, నిర్మాతల మండలి రెండు రోజుల గడువు అడిగినట్లు సమాచారం. అయితే, ఫెడరేషన్ ఈ రోజు నేరుగా లేఖ విడుదల చేసి, వేతనాలు పెంచకుంటే షూటింగ్లకు దూరంగా ఉంటామని ప్రకటించింది. కొన్ని నిర్మాణ సంస్థలు రోజువారీ వేతనాలు చెల్లించకుండా, వారం లేదా మూడు రోజుల తర్వాత చెల్లిస్తున్నాయని, ఇకపై రోజుకు రోజు చెల్లింపు జరగాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావం చూపనుంది.