ANDHRA PRADESH CM

ఏపీలో మెట్రో రైల్ కల సాకారం : విశాఖ, విజయవాడ ప్రాజెక్టులకు టెండర్లు.

ఏపీలో మెట్రో రైల్ కల సాకారం- విశాఖ, విజయవాడ ప్రాజెక్టులకు టెండర్లు :

ఏపీలో మెట్రో రైల్ కల సాకారం దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది.

మొత్తం 21,616 కోట్ల రూపాయలతో ఈ రెండు ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

విశాఖ మెట్రోకు 11,498 కోట్లు, విజయవాడ మెట్రోకు 10,118 కోట్లు కేటాయించగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులు సమకూర్చనున్నాయి.

ఏపీ సర్కార్ విశాఖకు వీఎంఆర్‌డీఏ నుంచి 4,101 కోట్లు, విజయవాడకు సీఆర్‌డీఏ నుంచి 3,497 కోట్లు వెచ్చిస్తోంది.

విశాఖ మెట్రో తొలి దశలో 46 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మిస్తారు.

VIZAG METRO

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కి.మీ, గురుద్వారం నుంచి పాత పోస్టాఫీసు వరకు 5 కి.మీ, దాడి చెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 6 కి.మీ. కారిడార్లు ఉంటాయి.

రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కి.మీ. కారిడార్ నిర్మాణం జరుగుతుంది. విజయవాడ మెట్రో రెండు దశల్లో నిర్మితమవుతుంది.

తొలి దశలో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టాండ్, ఆ స్టాండ్ నుంచి పెన్మలూరు వరకు 38.4 కి.మీ. కారిడార్లు, రెండో దశలో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి అమరావతి వరకు 27.5 కి.మీ. కారిడార్ నిర్మాణం చేపడతారు.

ఈ ప్రాజెక్టులకు విదేశీ బ్యాంకులు కూడా నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చాయి.

AP METRO RAIL

డీపీఆర్‌కు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించగా, కూటమి ప్రభుత్వం ఈ చొరవతో ఏపీ ప్రజల దీర్ఘకాల మెట్రో కలను నెరవేర్చే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రవాణా సౌలభ్యం, ఆర్థికాభివృద్ధి గణనీయంగా పెరుగుతాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.