HPV వ్యాక్సిన్ ఉచితం: గర్భాశయ క్యాన్సర్పై భారత్ యుద్ధం
భారతదేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్ల బాలికలందరికీ ఉచితంగా హెచ్పీవీ (HPV) వ్యాక్సిన్ అందించే భారీ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం లక్షలాది మహిళల జీవితాలను కాపాడే విప్లవాత్మక అడుగుగా ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అభివర్ణించారు.
పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్న డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాన్సర్ కేర్ అడ్వైజర్గా సేవలందిస్తున్నారు. ఈ ఉచిత వ్యాక్సినేషన్ పథకాన్ని ఆయన హర్షంతో స్వాగతించారు. ఇది కేవలం టీకా కాదు, మహిళల భవిష్యత్తును రక్షించే దూరదృష్టిగా పేర్కొన్నారు.
భారతదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఏటా సుమారు 80 వేల మంది కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో 42 వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ప్రతిరోజూ వందల మంది తల్లులు, సోదరీమణులు ఈ వ్యాధికి బలవుతున్నారు. ఈ క్యాన్సర్లో 80% కంటే ఎక్కువ కేసులు HPV వైరస్ (ముఖ్యంగా 16, 18 రకాలు) వల్ల వస్తున్నాయి. ముందస్తుగా వ్యాక్సిన్ తీసుకోవడమే దీన్ని నివారించే ఏకైక మార్గమని డాక్టర్ నోరి స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం గార్డాసిల్ వ్యాక్సిన్ను ప్రభుత్వ కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. ఏటా 1.2 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు ఈ రక్షణ కవచం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క డోస్తోనే దాదాపు 100% రక్షణ లభిస్తుందని, లైంగిక జీవితం ప్రారంభం కాకముందే ఇవ్వడం కీలకమని డాక్టర్ నోరి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డోసులు సురక్షితంగా పంపిణీ అయ్యాయని భరోసా ఇచ్చారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అపోహలు పెట్టుకోకుండా బాలికలకు ఈ టీకా వేయించాలని డాక్టర్ నోరి పిలుపునిచ్చారు. క్యాన్సర్ వచ్చాక చికిత్స కంటే రాకుండా నివారించడమే ఉత్తమమని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం భారత మహిళల ఆరోగ్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది.