
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ పై కఠిన చర్యలు.
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్పై కఠిన చర్యలు : కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ లపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర క్యాబినెట్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లు ఆమోదం పొందితే, ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొనడం లేదా ప్రమోషన్ చేయడం శిక్షార్హ నేరంగా మారనుంది. దీని కింద ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.
అయితే, చట్టవిరుద్ధ బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్పై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు భారత ప్రభుత్వం 1400 బెట్టింగ్ యాప్లు మరియు గ్యాంబ్లింగ్ వెబ్సైట్లను బ్లాక్ చేసింది. అయినప్పటికీ, ఈ యాప్లు దొంగ దారుల్లో భారత్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఈ యాప్లకు బానిసలైన కొందరు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు, మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కొందరు సినీ మరియు క్రీడా ప్రముఖులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్లపై నిషేధం ఉన్నప్పటికీ, కొందరు వీటిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆన్లైన్ బెట్టింగ్పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఈ గేమింగ్ బిల్లు ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ ను నియంత్రించి, సమాజంలో దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.